మొంథా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి… భద్రాద్రి సబ్ కలెక్టర్…
భద్రాచలం 28 అక్టోబర్ 25
రాష్ట్రంలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈనెల 28 నుండి 30 వరకు భద్రాచలం డివిజన్ గిరిజన ప్రజలు , గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ,తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలనీ,భారత వాతావరణ శాఖ(IMD) సూచించే సలహాలు, హెచ్చరికలను పాటించాలనీ అన్నారు.సాధ్యమైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరమని తెలియజేశారు, ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వైపు అనవసరమైన దూర ప్రయాణాలను నివారించుకుంటే మంచిదని, భారీ వర్షపాతం సమయంలోవరద ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించరాదనీ, వర్షం వస్తున్నప్పుడు చెట్ల కింద ఉండరాదని సూచించారు.వర్షంలో తడవడం చేయరాదని, ముఖ్యంగా చిన్నపిల్లలు వర్షంలో ఆడకుండా చూసుకోవాలని అన్నారు, విద్యుత్ స్తంభాలు, నియంత్రికలు, వైర్లు, మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని,శిథిలావస్థలో ఉన్న, పాడు పడిపోయిన ఇళ్లలలో నివసించకూడదని హెచ్చరించారు.మురుగునీటి కాల్వలు, కల్వర్టులకు,దూరంగా ఉండాలని,వరద నీటిలో నడవరాదని సూచించారు.వరద ప్రవహించే వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదనీ, ప్రజలందరూ సురక్షితంగా ఉండి స్థానిక అధికారులకు సహకరించాలని సబ్ కలెక్టర్ అన్నారు









